వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న
పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
గారు అధికారులకు ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై శనివారం నాడు బషీర్ బాగ్ లోని కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24 వ తేదీ నుండి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు,పాఠశాలలకు కూడా పంపుతాం అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని, ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలో డిఈఓ లు,ఆయా జిల్లాల కలెక్టర్లు,ఎస్పి లు,ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ గారు,పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన గారు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు గారు పాల్గొన్నారు.