*నల్లగొండ టూ టౌన్ ఘటనపై సమగ్ర విచారణ : ఎస్పీ రంగనాధ్*
- - విచారణ అధికారిగా డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి - - లేని భూమిని విక్రయించి 35% బ్రోకరేజ్ తీసుకున్న రొయ్య శ్రీనివాస్ - - విచారణ అనంతరం తదుపరి చర్యలు నల్లగొండ : దళిత యువకుడిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి కాలు విరగొట్టారని వస్తున్న ఆరోపణలు, ప్రసార మాధ్యమాలలో వార్తల నేపధ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. భూ వివాదంలో ఎస్.ఐ. జోక్యం చేసుకున్నాడని, దళిత యువకుడి పై విచక్షణా రహితంగా దాడి చేశారని వస్తున్న ఆరోపణల క్రమంలో సమగ్ర విచారణ కోసం డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. విచారణలో పోలీస్ అధికారులు తప్పు చేసినట్లుగా నిర్ధారణ అయితే వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. రొయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి నల్లగొండ పట్టణంలో లేని భూమిని కాగితాలపై ఉన్నట్లుగా చూపించి విక్రయించడని, ఆ భూమిలో ఇల్లు నిర్మాణం చేసి ఉన్నదని బాధిత వ్యక్తులు 6 జులై 2021 రోజున టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో రొయ్య శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. చీటింగ్ కేసుకు సంబంధించి గత నెల 10వ తేదీన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి నోటిషులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. లేని భూమిని విక్రయం వ్యవహారంలో శ్రీనివాస్ 35% కమిషన్ తీసుకున్నట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని స్పష్టం చేశారు. శ్రీనివాస్ తో పాటు అతనిపై పిర్యాదు చేసిన బాధితుల నుండి సమగ్రంగా అన్ని వివరాలు సేకరించి పోలీసుల తప్పు ఉన్నట్లుగా నిర్ధారణ జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. *సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియో నల్లగొండది కాదు* ఎవరో ఒక వ్యక్తిని కాళ్లు కట్టేసి కొడుతున్నట్లుగా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వీడియో నల్లగొండ టూ టౌన్ పోలీసులు రొయ్య శ్రీనివాస్ అనే వ్యక్తిని కొడుతున్నట్లుగా అసత్య ప్రచారం సాగుతుందని, ఆ వీడియో నల్లగొండ జిల్లాకు సబందించినది కాదని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. తప్పుడు ప్రచారాలు, వైరల్ అవుతున్న వీడియోను ప్రజలు నమ్మవద్దని ఆయన జిల్లా ప్రజలను కోరారు.