*పోలీసులకు వాసవీ క్లబ్స్ సేవలు అద్వితీయం*
నల్లగొండ : లాక్ డౌన్ అమలులో భాగంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వాసవీ క్లబ్స్ అందిస్తున్న సేవలు అద్వితీయమని నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్ సిఐలు నిగిడాల సురేష్, చంద్రశేఖర్ రెడ్దిలు అన్నారు.
మంగళవారం వాసవీ క్లబ్ సిల్వర్ స్టార్ కేసిజిఎఫ్ నల్లగొండ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు వివాహ వార్షికోత్సవ సందర్భంగా పోలీసులకు భోజనాలు, వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకేట్స్ అందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ
శాంతి, అహింసలకు ప్రతిరూపంగా కొలిచే వసవిమాత పేరుతో నిర్వహిస్తున్న వాసవీ క్లబ్స్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ అమలులో భాగంగా రోడ్లపై విధి నిర్వహణ చేస్తున్న పోలీస్ సిబ్బందికి భోజనాల రూపంలో అమ్మవారి ప్రసాదం అందించడం సంతోషంగా ఉన్నదన్నారు. ప్రతి నిత్యం పోలీసులకు భోజనాలు అందజేస్తూ వారి ఆకలి తీర్చడంతో పాటు లాక్ డౌన్ పటిష్ట అమలుకు సహకరిస్తున్నారని ఇది ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. వాసవీ మాతను కులదైవంగా పూజిస్తూ సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైశ్యుల సేవా నిరతిని అభినందించారు.
కార్యక్రమంలో రేపాల భద్రాద్రి రాములు, అసిస్టెంట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, గుండా రమేష్ బాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, కందుకూరి మహేందర్, కాసం శేఖర్, తేలుకుంట్ల శ్రీకాంత్, తదితరులున్నారు.