జర్నలిస్టుల్ని ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నాం: డీహెచ్
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా కట్టడికి అన్ని శాఖలు సమష్టిగా కృషిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాటివిటీ రేటు 4.1శాతంగా ఉందన్నారు. ఇప్పటివరకు 1.47కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200లకు పెంచుతున్నట్టు డీహెచ్ ప్రకటించారు.
పాజిటివిటీ రేటు తగ్గుతోంది..
తెలంగాణలో ఇప్పటివరకు 56 లక్షల మందికి టీకాలు వేసినట్టు డీహెచ్ వెల్లడించారు. ప్రస్తుతం 6.18 లక్షల కొవిషీల్డ్, 2.5లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూన్ తొలి వారంలో మరిన్ని డోసులు వస్తాయన్నారు. నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండే వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వారికి ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ చేయనున్నట్టు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి 3లక్షల మందికి కొవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 4.1శాతం; రికవరీ రేటు 92.52శాతంగా ఉందన్న ఆయన.. మరణాల రేటు 0.56శాతంగా ఉందని తెలిపారు.
ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు
కొవాగ్జిన్ తీసుకున్నవారు నాలుగు నుంచి ఆరు వారాల మధ్య రెండో డోసు; కొవిషీల్డ్ తీసుకున్నవారు 12 నుంచి 16వారాల మధ్యలో రెండో డోసు తీసుకోవాలని డీహెచ్ సూచించారు. ‘‘రాష్ట్రంలో ప్రతి 10 మందిలో నలుగురికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. గత వారానికి రాష్ట్రంలో 55వేల బెడ్లు ఉంటే ఇప్పుడు దాన్ని 55,120కి పెంచుకోగలిగాం. ప్రస్తుతం 31,375 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రిపాలైన రోగులు 23,745 మంది. వీరిలో 40శాతం రోగులు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు చెందినవారే. ఐసీయూ బెడ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో 612, ప్రైవేటులో 3,977 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 4,589 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ పడకలు 9,718 అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,750 పడకలు ఉండగా.. ప్రైవేటులో 6,968 బెడ్లు ఖాళీగా ఉన్నాయి’’ అని వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు
‘‘కరోనా తర్వాత కొందరు బ్లాక్ఫంగస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు అందిస్తున్నాం. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో 240కి పైగా బ్లాక్ఫంగస్ కేసులు ఉన్నాయి. రోజూ 20 బ్లాక్ ఫంగస్ బాధితులకు శస్త్రచికిత్స చేస్తున్నాం. రాష్ట్రంలో 1500 కేంద్రాల్లో కొవిడ్ ఓపీ సేవలు ఉన్నాయి. 2.7లక్షల మందిలో లక్షణాలు గుర్తించి కిట్లను అందజేశాం’’ అన్నారు.