*కోవిడ్ ఆంక్షలపై కూలీలకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు
*
- - ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచన
నల్లగొండ : కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని కూలీలకు అవగాహన కల్పించారు నల్లగొండ ట్రాఫిక్ పోలీసులు.
ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని డీఈఓ కార్యాలయం వద్ద నిత్యం కూలీ పనులకు వెళ్లే వారికి ప్రభుత్వ మార్గదర్శకాలు, మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకత, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా వారి ఆరోగ్యాలతో పాటుగా కుటుంబాలను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించి వారికి అవగాహన కల్పించారు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల జరిమాన వేయడం జరుగుతుందని, విధిగా మాస్క్ ధరించి కోవిడ్ బారిన పడకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. కూలీ పనులకు వెళ్లే క్రమంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వంతో సహకరించాలని కోరారు.
అనంతరం రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా దేవరకొండ రోడ్డులో పలు ప్రాంతాలలో తెరిచి ఉంచిన రోడ్డు క్రాసింగులను, డివైడర్ల మధ్య తెరిచి ఉన్న వాటిని మూసివేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ వెంట ట్రాఫిక్ సిబ్బంది మహేందర్, వెంకటేశ్వర్లు, మీరా, స్వామి తదితరులున్నారు.